మంథని మాతా–శిశు కేంద్రంలో విజయవంతంగా రెండు సిజేరియన్ శస్త్రచికిత్సలు
మాతా–శిశు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి సూచన
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 05
మంథని మాతా–శిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా నిపుణురాలు డాక్టర్ గుంట మౌనిక, శిశువైద్య నిపుణుడు డాక్టర్ చిలకలపల్లి నరేష్ ఆధ్వర్యంలో రెండు సిజేరియన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సల ద్వారా ఒక బాబు, ఒక పాప జన్మించగా, తల్లులు మరియు శిశువులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మంథని ఏరియా ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ టి.వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రెగ్యులర్ వైద్యులను నియమించడంతో మంథని ప్రాంత గర్భిణీలు, చిన్నారులకు ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు మాతా–శిశు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా వైద్య సూపరింటెండెంట్ను సంప్రదించాలని సూచించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని గర్భిణీలు, ఆశా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.